, దెందులూరు: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడులో అభద్రతాభావం స్పష్టంగా కనిపిస్తోందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి అన్నారు. చంద్రబాబు జిల్లాలోని మూడురోజుల పర్యటనలో మాట్లాడిన ప్రతిచోటా హావభావాలు ఈవిషయాన్ని స్పష్టం చేస్తున్నాయన్నారు. గురువారం దెందులూరు నియోజకవర్గ పార్టీ కార్యాలయ ఆవరణలో చంద్రబాబు మూడురోజుల జిల్లా పర్యటన, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కు వత్తాసు పలకటంపై ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి విలేకరులతో మాట్లాడారు. చింతమనేనిని వెనకేసుకురావటానికే చంద్రబాబు సమయం మొత్తం కేటాయించారన్నారు. పార్టీ ఓటమికి కారణాలు, పరిస్థితులపై చర్చించకుండా చింతమనేనిని అమాయకుడిగా చిత్రీకరించేందుకు చంద్రబాబు నానా తంటాలు పడిన విషయాన్ని రాష్ట్ర ప్రజలంతా నిశితంగా పరిశీలించారన్నారు. దళితులను కించపరిచేలా చింతమనేని వ్యాఖ్యానించటం నిజం కాదా అని ఎమ్మెల్యే కొఠారు ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న విధానం, వేగాన్ని చూసి చంద్రబాబు బెంబేలెత్తుతున్నారన్నారు.
చంద్రబాబులో అభద్రతాభావం: అబ్బయ్యచౌదరి